9, డిసెంబర్ 2017, శనివారం

ఈనాటి(26.11.2017) ఈనాడు హాయ్ బుజ్జీలో నేను రాసిన 75వ పిల్లల కథ..."నమ్మకం." శుభోదయం అందరికీ..ధన్యవాదాలు ఈనాడు హాయ్ బుజ్జీ డెస్క్ కి.


ఈ నెల డిసెంబర్,2017 భావ తరంగిణి మాసపత్రికలో నా సమీక్షలు: 1.మా ఊరు....సంపాదకులు..శ్రీ గుదిబండి వెంకట రెడ్డి. 2. వంద ప్రశ్నలు-వేల భావాలు(కేతవరపు రాజ్యశ్రీ సాహిత్య విశ్లేషణ.)..నియోగి.


5, నవంబర్ 2017, ఆదివారం

ఈనాటి(05.11.2017) ఈనాడు హాయ్ బుజ్జీలో నేను రాసిన 74వ పిల్లల కథ. "కప్ప కపటం"



24, జూన్ 2017, శనివారం

వాడంతే! -గుడిపూడి రాధికా రాణి.


గురుప్రసాద్ మీడియా డైరెక్టరీ లో లిటరరీ పర్సనాలిటీస్ విభాగం కొరకు నా వివరాలు అడిగి తీసుకుని చేర్చటమే కాక శ్రద్దతో నాకు చేరేలా పుస్తకం ప్రతిని పంపిన యువకళావాహిని శ్రీ వై.కె.నాగేశ్వర రావు గారికి ధన్యవాదాలు.

Guru Prasad Media Directory released at the Cultural Centre of Vijayawada and Amaravathi in ANDHRA PRADESH STATE to-day. Dr.D.Vizaibhaskar, Director, Andhra Pradesh Langugue and Cultural Department released the Directory. Padmasri Dr.Thurlapati Kutumba Rao, Dr.Modali Nagabhooshana Sharma, Dr.Emani Sivanagi Reddy, Smt.Ln Laxmi Kumari, Sharada Kalasamithi Sri Dogiparthi Shankar Rao, Sri G.Narayanayana Rao and Yuvakalavahini Ln YK Nageswara Rao participated in the function, Singers Mohammad and Rasool Babu presented the film music.



20, జూన్ 2017, మంగళవారం

బాల్యం లో ఒక జ్ఞాపకం...

బాల్యం లో ఒక జ్ఞాపకం...
-------------------

ఒకసారి సర్కస్ వచ్చింది ఊళ్ళోకి..
ఇంక చూడండి బళ్ళో.. ప్రతిరోజూ..రోజుక్కొందరు పిల్లలు మేం చూశాం అంటే మేం చూశాం మేం వెళ్ళాం అంటే మేం వెళ్ళాం..వాళ్ళు సర్కస్ లో చూసిన జంతువులు చేసిన విన్యాసాలు,మనుషులు ఆడిన ఆటలు,జనాలు వేసిన విజిల్స్, వీళ్ళు కొట్టీన కేరింతలు..ఒకటే వర్ణించడం.
వాళ్ళు ఆ రోజుకి హీరోలు;అప్పటికింకా వెళ్ళని వాళ్ళకి ఒకటే ఆరాటం పెరిగిపోవడం..ఇంటికెళ్ళిపోయి అమ్మ దగ్గర గారాలు,నాన్నకి అమ్మతో సిఫార్సులు..
శివరామ కృష్ణ వెళ్ళిన రోజైతే మా ఇంగ్లీష్ మాష్టారు కూడా కుటుంబ సమేతంగా వెళ్ళార్ట.మాధవి వెళ్ళినప్పుడేమో  మా లెక్కల మాష్టారిని చూసిందిట వాళ్ళబ్బాయితో..పాఠాల సంగతేమో గానీ ఈ కబుర్లెక్కువైపోయాయ్.వెళ్ళని వాళ్ళకేమో ఎప్పుడెప్పుడా అని ఆరాటం పెరిగిపోతోంది.
    హమ్మయ్య! నా రోజొచ్చింది.స్టేట్ బ్యాంక్ లో మేనేజర్ అయిన నాన్న ఆ సాయంత్రం తొందరగా వస్తానని,అందర్నీ తీసుకెళ్తాననీ మాటిచ్చారు.అందరం బోల్డు సంబరంగా తయారయ్యాం.బయటపడలేదు కానీ అమ్మక్కూడా సరదాగానే ఉందని పసిగట్టాం.బయట జనం మూగిన చోట అమ్మేవి కొనుక్కోవడం ఆరోగ్యానికి మంచిది కాదంటూ అమ్మ జంతికలు,సున్నుండలు,నీళ్ళ సీసాలు పెట్టింది."అవేం అక్కర్లేదు.ఆ ఏనుగులు,సిం హాలు,కోతులు,బఫూన్లు చూస్తేనే చాలు..ఆకలి కూడా గుర్తు రాదు"అని మేం చెప్తున్నా వినకుండా తొమ్మిది దాటుతుంది.ఆకలంటారంటూ..
  అన్నట్లే నాన్న త్వరగా వచ్చి మమ్మల్ని తీసుకెళ్ళారు.మొదటి వరుసలో దగ్గరగా కూర్చుని చూసేలాగా టిక్కెట్లు కొన్నారు.ఆనందంగా సెటిలయ్యాం.కాసేపటికే హాలు నిండిపోయింది.
ఎదురు చూసి,కలవరించిన సర్కస్ మొదలైపోయింది. హమ్మయ్య...
కానీ...ఒక పావుగంట కూడా అవలేదు.పులి,సిం హం రానే లేదు.గుండ్రటి ఇనుప బంతిలో అబ్బాయి మోటార్ సైకిల్ నడపనేలేదు.అందమైన అమ్మాయిలు గిరగిరా తిరుగుతూ..ఉయ్యాలలూగుతూ సందడి చేయనేలేదు.పొట్టి జోకర్లొచ్చి సరిగ్గా నవ్వించడం మొదలెట్టనే లేదు..కోతులు కాసిని వచ్చి ఆడాయ్,సైకిల్ తొక్కాయ్ అంతే..ఒక ఏనుగొచ్చి బల్లపై ముందు కాళ్ళు ఆనించి  తొండం ఎత్తుతోంది...
    ఠప్!! లైట్లారిపోయాయ్!! కరంటు పోయిన వెంటనే...హోరెత్తే మ్యూజిక్ ఆగిన వెంటనే అందరి చెవులకీ సోకిన గాలి మోత..గాలి,పెను గాలి,ఉరుముల శబ్దం,మెరుపుల వెలుగులో  అందరి మొహాల్లో ప్రతిఫలిస్తున్న నిరాశ..కాసేపటికే నెత్తి మీద షామియానా పైన టపటప మంటొ చినుకుల మోత..చాలా కొద్దిసేపట్లోనె భారీగా మారిన వర్షం..గాలి తాకిడికి ఊగిపోతున్న షామియానాలు..మరో అరగంటకి కుండపోతగా వర్షం..దూరంగా పిడుగుల మోత..అందరి మొహాల్లో ఆందోళన గా మారిన నిరాశ.
పెద్ద శబ్దంతో షామియానా పడిపోయింది.కేకలు వేస్తూ,తొక్కిసలాడుతూ..జనమంతా బయట పడ్డారు.ఎవరికి వాళ్ళే ఆ కూలిపోయే టెంట్లకి,కరంటు వైర్లకి దూరంగా వెళ్ళాలని తహతహలాడారు.వర్షంలో తడుస్తున్నా లెక్క చేయకుండా బయట పడ్డారు.కొందరు షాపుల అరుగులపై చేరినా ఇప్పుడిప్పుడే తగ్గే వాన కాదని నిర్ణయించుకుని తడుస్తూనే ఇంటిదారి పట్టారు.
   మేమూ నడుస్తున్నాం.ఏనుగుతొండాల్తో దిమ్మరించినట్లు పెద్ద వాన..విడిగా తడుస్తాం అంటే ఒప్పుకోరుగా! అందుకని మాకు ఆనందంగా ఉంది అలా అంత ధారల్లో తడుస్తూ నడవగలగడం ...సర్కస్ కోల్పోయిన నిరాశని తాత్కాలికంగా పోగొట్టింది ఆ సంతోషం..ఇంటికెళ్ళాక  అమ్మ వేడి వేడిగా ఉప్మా చేసింది.అందరం తింటున్నాం.రేపు ఫ్రెండ్స్ నవ్వుతారేమో..ఎలా అనే ఆలోచన నాదీ,చెల్లిదీ.అక్కేమో రేపు బడి ఎగ్గొట్టేస్తే! అనే ఆలోచనలో ఉందనుకుంటా.మీకూ,పిల్లలకి జలుబు చేయకుండా ఉంటే బాగుండు అంటోంది అమ్మ నాన్నతో.. మరి అమ్మ కదా!
   ఇంతలో అన్నయ్య అన్నాడు.."సర్కస్ వాడికి లాభం మనకి నష్టం..మన టిక్కెట్లు వేస్టయిపోయాయి.వాడు షో వేయక్కర్లేకుండా డబ్బులొచ్చేశాయ్." అని.
   అప్పుడు నాన్న అన్న మాటలు నాకో విలువైన పాఠం." అలా అనుకోకూడదు మనం..తన నలుగురు పిల్లలు తడిస్తేనే అమ్మ ఎంత ఆదుర్దా పడుతోందో చూశావు కదా! మరి వాళ్ళకి ఎంత కష్టం అన్ని మూగప్రాణాలు,అంతమంది మనుషులు.. వారికి రక్షణ,ఆహారం..ఏం వైర్లు తగిలి షాక్ కొడుతుందో అని టెన్షను..ధ్వంసమైన టెంటు సామాను,కుర్చీల సంగతి చూసుకోవాలి..ఈ రాత్రి వారికి ఎంత ఇబ్బందికరమైనదిగా మారుతుందో ఆలోచించండి.మనం పొడిబట్టలేసుకుని,వేడిగా ఇంత తిని నిశ్చింతగా దుప్పట్లు కప్పుకుని పడుకోగలిగిన స్థితిలో కూడా ఎదుటివారి ఇబ్బంది ని ఊహించి అంగీకరించగలగడం నేర్చుకోవాలి..ఆ గుణమిప్పటినుండి ఉంటేనే పెద్దయినాక సహాయం చేసే ఉద్దేశ్యం కలుగుతుంది."

సమస్యను ఎదుటివారి కోణం లో చూడమని నేర్పిన నాన్నకు ప్రేమతో*******  

15, జూన్ 2017, గురువారం

ఉపన్యసించడం,

మిత్రులారా! నిన్న (11.6.2017) సాయంత్రం గుడివాడ షా గులాబ్ చంద్ గ్రంథాలయంలో భారతీ సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఉగాది పురస్కార గ్రహీత,ప్రముఖ నగిషీ చిత్రకారుడు శ్రీ దర్శి జ్వాలాచారి గారి అభినందన సత్కార సభలో నేను ముఖ్య అతిథిగా పాల్గొన్నాను.
రాష్ట్ర కవి శ్రీ శంకరంబాడి సుందరాచారి జీవన రేఖలను,సాహితీ ప్రస్థానాన్ని సాకల్యంగా వివరించే భాగ్యం పొందాను.అభిమానంతో తన పుస్తకాలను ఇచ్చి ఆశీర్వదించిన శ్రీ Vasudha B Rao గారికి విశ్రాంత డైట్ ప్రిన్సిపాల్ శ్రీ ఎం.వి.జి.ఆంజనేయులు,కృష్ణా తరంగాలు మాసపత్రిక సహ ఉపసంపాదకులు శ్రీ రాఘవాచారి గారు ముఖ పుస్తక మిత్రులు శ్రీ వంశీ,తదితరులను కలవడం ఒక ఆనందమైతే ...పుట్టిల్లు గుడివాడ లో (6వ తరగతి నుండి వివాహం వరకు అక్కడే) ఉపన్యసించడం, నాన్న మిత్రులు రంగా అండ్ కో అధినేత ఆశీర్వదించడం..ఒక గుర్తుండిపోయే మంచి సందర్భం..నిర్వాహకులకు,శ్రీమతి పుట్టి నాగలక్ష్మి గారికి ధన్యవాదాలు.Image may contain: 4 people, people sitting and indoorImage may contain: 4 people, people standing

ఈనాటి (15.6.2017) ఈనాడు హాయ్ బుజ్జీ లో నేను వ్రాసిన 68వ పిల్లల కథ.."కోతి నేర్చుకుందో పాఠం! ".


27, ఏప్రిల్ 2017, గురువారం

***బాల్యంలో నా జ్ఞాపకం..***

               ***బాల్యంలో నా జ్ఞాపకం..***
నమ్ముతారో లేదో కానీ అమ్మ,నాన్న ఇద్దరూ కలిసి ఎలా నేర్పేశారో మరి..నాలుగేళ్ళకే అక్షరాలు గుర్తుపట్టి చదివే దాన్ని.చందమామ నా చేతిలో ఉంచుకునే నిద్రలోకి జారుకునేంత ప్రాణంగా ఉండేదాన్నిట.పదాలు,వాక్యాలు,పేరాలు,పేజీలు..పుస్తకం పట్టుకుని గడగడ చదువుకుపోతుంటే అందరూ ముచ్చటపడేవాళ్ళుట.ఇంకో ఏడాదికి రాయడం కూడా వచ్చేసింది..కానీ ఎడమచేతితో..
అలాంటి నాకు కష్టం బడిలో చేరే రూపంలో ముంచుకొచ్చింది.మాష్టారు పలకమీద అ,ఆ అనీ పలక తిప్పి ఇ,ఈ అనీ రాసిచ్చి దిద్దమన్నారు.నేను ఎడమచేత్తో బలపం పట్టుకున్నా.ఎడమచేతి మీద బెత్తం దెబ్బ పడింది చుర్రుమంటూ..బలపం కుడిచేతిలోకి మార్చుకోమని కళ్ళెర్రజేస్తున్నారు మాష్టారు.కళ్ళనీళ్ళు కారిపోతుండగా రాయడం ప్రయత్నిస్తున్నా.కుదరట్లేదు.దిద్దకుండా దిక్కులు చూస్తున్న నాకు ఈ సారి వీపు మీద పడింది దెబ్బ ..
కొత్తపిల్లల్ని బెదరగొట్టకండి మాష్టారూ! ఇంకో టీచర్ వారిస్తోంది దేవతలా.
ఇంతలో హడావిడిగా నాన్న వచ్చారు..దేవుడు దిగివచ్చినట్లు.
"మా పాప రాధిక ను చేర్చామండీ ఈ రోజు..మా ఆవిడ నేను చెప్పాననుకుని చెప్పలేదుట.అమ్మాయికి రాయడం,చదవడం వచ్చు.మళ్ళీ అక్షరాలు దిద్దించకుండా ఇంకేమైనా నేర్పండి చాలు." అన్నారు.
"లేదండీ ఏం రాయలేకపోతోంది".అన్నారు మాష్టారు.పాపం నాన్న  తెల్లమొహమేశారు."భయమేమోనండీ..ఏమ్మా! 5 పూల పేర్లు రాయి." అన్నారు.నేను ఎడమచేత్తో గబగబా రాయగానే మాష్టారు ఫెళ్ళున నవ్వి "పురచేతివాటమా! మరి చెప్పరేం? అలవాటు మార్పించండి ఓ వారంలో" అన్నారు.ఆ వెక్కిరింత నాలో బడి అంటే అయిష్టాన్ని నాటింది.
"తెలివైన పిల్లండీ..కొంచెం మెల్లిగా చెప్పండి.." అని నాన్న వెళ్ళిపోగానే మాష్టారు నా కేసి తిరిగి "గడగడా చదివేస్తావుట..ఏదీ? పుస్తకం పట్టుకురా." అన్నారు. ఇంతలో గంట మోగింది.ఇంటికి పరుగెత్తా సంచి తగిలించుకుని. అన్నం తిని మళ్ళీ వెళ్ళమనగానే ఏడుపు మొదలెట్టా.అమ్మ బుజ్జగించి " నీకు పుస్తకాలు చదవడం వచ్చు కదా! చదువుకో హాయిగా." అని నచ్చజెప్పి పంపింది.నాకు ఎందుకో కళ్ళకు కట్టినట్లు గుర్తుంది.బడిలో చేరినపుడు ఇచ్చిన పుస్తకాలు అన్నీ బల్లపై పెట్టేశా ఎందుకో మరి.సంచిలో రెండు కథల పుస్తకాలు పెట్టుకుని వెళ్ళిపోయా.అలా ఎందుకు చేశానో మరి....
మధ్యాహ్నం మాష్టారు  అందరినీ లెక్కల పుస్తకాలు తీయమన్నారు.అంతా తీశారు.నేను,ఇంకో ఇద్దరు మిగిలాం.వాళ్ళూ నాలాగే తేలేదు.చెయ్యి చాపమని బెత్తం పట్టుకుని వచ్చారు ఆయన.ఒకరికి పడింది దెబ్బ.నా దగ్గరకు రాగానే ....హయ్యో రామా.. మాష్టారి చేతిలో బెత్తం లాక్కుని ముక్కలుగా విరిచేసి అక్కడే పడేసి ఏడుస్తూ ఇంటికి పరుగో పరుగు..అంతే..ఇంక నేను 1,2, తరగతులు చదవనేలేదు. సరాసరి 3వ తరగతిలో చేరా.1,2 తరగతుల వయస్సులో ఇంట్లో ఉండి నేను చదివినన్ని పుస్తకాలు ఎవరూ చదివి ఉండరు .. ఇంతకీ చెప్పొచ్చేదేమంటే బెత్తంతో భయపెడితే చదువంటేనే భయం పుడుతుంది..అవునా కాదా?

5, ఏప్రిల్ 2017, బుధవారం

awarded by DEO sir.

మిత్రులారా! శుభ సాయంత్రం. ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది. జిల్లా విద్యాశాఖాధికారి శ్రీ సుబ్బారెడ్డి గారు నా బాలసాహితీ కృషిని ప్రశంసిస్తూ నాకు ప్రత్యేక సన్మానం చేశారు.నా కథలలో 'అమ్ములూ-అయిదు రూపాయలూ" కథ బాగా నచ్చిందని పేర్కొంటూ నా సాహితీ ప్రక్రియలను ప్రోత్సహించే టానిక్ గా ఈ సత్కారాన్ని భావింపవలసిందిగా తెలిపారు.టెంత్ స్పాట్ వేల్యుయేషన్ మూడవ రోజు,శ్రీ రామనవమి ...మచిలీపట్నం సెయింట్ ఫ్రాన్సిస్ స్కూల్ ఆవరణలో జిల్లావ్యాప్తంగా వచ్చిన ఉపాధ్యాయుల మధ్య  లభించిన ఈ గౌరవం నాకు చాలా ప్రత్యేకమయినది.నా సాహితీ ప్రయాణాన్ని గురించి నాతో మాట్లాడించారు,వారూ మాట్లాడారు. నేను రాసిన గజల్ ఒకటి పాడించారు.గణిత ఉపాధ్యాయిని అయినా చక్కని శైలితో మంచి కథలు రాస్తున్నానని కొనసాగించమని దీవించారు.వృత్తి ప్రవృత్తులలో రాణిస్తున్న మరి కొందరికి కూడా సన్మానాలు జరిగాయి.
 



30, మార్చి 2017, గురువారం

ugadi..29.3.2017

ప్రభుత్వ జిల్లా సాంస్కృతిక సమాఖ్య నిర్వహించిన 29.3.2017 హేవిళంబి ఉగాది కవిసమ్మేళనం లో నేనూ పాల్గొన్నాను.మహిళల్లో ధైర్యం పెరగాలని ఆకాంక్షిస్తూ కవిత చదివి సన్మానింపబడ్డాను.బందరు టౌన్ హాల్లో ఈ కార్యక్రమం జరగడం నాకెంతో సంతోషం కలిగించింది.ఆ వేదికపై నేను ఆంధ్ర సారస్వత సమితి,సాహితీమిత్రులు వంటి మంచి సంస్థలచే పురస్కారాలు పొందాను.ఎన్నో ఉపన్యాసాలు ఇచ్చాను.నేడు అది చీరల దుకాణం గా మారిన తరుణంలో ఈ వేదిక మళ్ళీ ఎక్కగలగడం నా మధురస్మృతులను వెలికితీసి సన్నజాజి పరిమళం సోకినట్లు  మనసుకు హాయినిచ్చింది. ఆ వార్తకు చెందిన పేపర్ క్లిప్స్ వరుసగా ఆంధ్రజ్యొతి, ఈనాడు, ఆంధ్రభూమి,సాక్షి లు మీకోసం..(ఇతర కవులు శ్రీ గుడిసేవ విష్ణుప్రసాద్,కారుమూరి రాజేంద్రప్రసాద్,ముదిగొండ శాస్త్రి,సత్యనారాయణ రావు, డా.చింతలపాటి మురళీకృష్ణ,దండిభొట్ల దత్తాత్రేయ శర్మ, ముదిగొండ సీతారావమ్మ, మడమల రాంబాబు,జాన్ బాబు, రాజశేఖర్, మేరీ కృపాబాయి,సుధారాణి,మాధవి,రామకృష్ణ మరియు సమన్వయ కర్త భావతరంగిణి సంపాదకులు భవిష్య).